– తప్పిన పెనుప్రమాదం
జొన్నాడ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారిపై ఆంజనేయస్వామివారి ఆలయం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ రాష్ట్రానికి చెందిన బస్సు చెట్టును ఢీకొని ధ్వంసంకాగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించి హైవే పోలీస్ పెట్రోలింగ్, హైవే పెట్రోలింగ్, ఆలమూరు ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాలు ప్రకారం అస్సాం రాష్ర్టానికి చెందిన కూలీలు కేరళ రాష్ట్రంలో పనికి వెళుతుండగా జొన్నాడ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి (వాహనం సాంకేతిక లోపం ఏర్పడి) బస్సు బ్రేకులు ఫెయిల్ అవటంతో ఒక్కసారిగా జాతీయ రహదారి పక్కనున్న చెట్టును ఢీ కొట్టి ఆగిపోయిందని, చెట్టు లేకపోతే పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లి భారీ ప్రాణ నష్టమే జరిగి ఉండేదని తెలిపారు. అస్సాం రాష్ట్రానికి చెందిన వలస కూలీలు బస్సులో చిన్నారులు, మహిళలు, పురుషులు కలిపి సుమారు 50 మంది వలస కూలీలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వలస కూలీలు నుండి వివరాలు సేకరిస్తున్నారు.