VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 11:38 am Posted by : BOMMU DURGARAO

కే.గంగవరం జడ్పీ హైస్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ‘తిరంగా ర్యాలీ’

విశ్వం వాయిస్ న్యూస్ కే.గంగవరం:
కే.గంగవరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం “హర్ ఘర్ తిరంగా” భారీ ర్యాలీ అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పితాని శ్రీనివాస్ (ఇంచార్జ్) అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ర్యాలీ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం నుండి ప్రారంభమై, గ్రామ పురవీధుల మీదుగా ప్రధాన బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని, “వందేమాతరం”, “భారత్ మాతాకీ జై” అంటూ చేసిన దేశభక్తి నినాదాలతో కే.గంగవరం వీధులు మార్మోగాయి.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాశాఖాధికారి నాగరాజు గారు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందాలని, స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటుతూ మండల పరిధిలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను తప్పనిసరిగా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఇతర మండల స్థాయి అధికారులు మాట్లాడుతూ… విద్యార్థి దశ నుంచే దేశభక్తి, క్రమశిక్షణ మరియు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, దేశ ఔన్నత్యాన్ని కాపాడే పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో భవాని శంకర్, ఈవోపీఆర్డీ సాంబమూర్తి, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.