ద్రాక్షారామం: విశ్వం వాయిస్ న్యూస్
ద్రాక్షారామం మార్కెట్లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో సుమారు 20 కూరగాయల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎస్ఐ, సీఐ మరియు అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రాణనష్టం జరగకుండా, మంటలు మరింత విస్తరించకుండా వారు చేసిన కృషిని స్థానికులు అభినందించారు. అధికారుల సకాలంలో స్పందన పట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు వెంటనే మార్కెట్ను సందర్శించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, నష్టపోయిన బాధితులతో మాట్లాడారు. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన వ్యాపారులను చూసి మంత్రి చలించిపోయారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, బాధితులకు తగిన పరిహారం అందించి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.