VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 7:50 pm Posted By : VISWAM VOICE DAILY

ప్రమాదవశాత్తూ గోదావరిలో మునిగి వ్యక్తి మృతి.

గండిపోశమ్మ ఆలయ సమీపంలో ఘటన.

దేవీపట్నం, విశ్వంవాయిస్ న్యూస్ :
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ గండి పోశమ్మ ఆలయం స్నానాల ఘాట్ వద్ద ఆదివారం చోటుచేసుకున్న విషాద ఘటన భక్తులను కలచివేసింది. గండేపల్లి మండలం కె.గోపాలపురం గ్రామానికి చెందిన గోపాల సతీష్‌ (25), తండ్రి నాగేశ్వరరావు, తన స్నేహితులతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చాడు. దర్శనానికి ముందు గోదావరిలో పవిత్ర స్నానం చేసేందుకు ఇద్దరు స్నేహితులతో కలిసి నదిలోకి దిగగా ప్రమాదవశాత్తు కాలుజారి లోతైన నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు.స్నేహితులు, స్థానికులు కేకలు వేస్తూ రక్షించే ప్రయత్నం చేసినా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సతీష్ కనిపించకుండా పోయాడు. సమాచారం అందుకున్న దేవీపట్నం ఎస్సై షరీఫ్, పోలీసులు సిబ్బంది, ఫైర్ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు సంఘటన స్థలానికి చేరుకుని గంటల తరబడి గాలింపు చర్యలు చేపట్టారు.అనంతరం యువకుడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై షరీఫ్ వెల్లడించారు.మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.