VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 11:29 am Posted by : VISWAM VOICE DAILY

వెదురుపాక విజయదుర్గా పీఠానికి తీరని లోటు

విజయ దుర్గ పీఠాధిపతి శ్రీ వివి సుబ్రహ్మణ్యం ( గాడ్) (90) కన్నుమూత

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: తూర్పుగోదావరి జిల్లా, రాయవరం మండలంలోని, వెదురుపాక గ్రామంలో గల శ్రీ విజయదుర్గా పీఠం కు పీఠాధిపతిగా సేవలందించిన శ్రీ వి.వి. సుబ్రహ్మణ్యం (గాడ్) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే భక్తులు, శిష్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దేవీ ఉపాసన, ఆధ్యాత్మిక బోధనలు, యజ్ఞయాగాదులు, ధార్మిక సేవల ద్వారా వేలాది మంది భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఆయన మరణం ఆధ్యాత్మిక వర్గాల్లో విషాదాన్ని నింపింది. అనేక సంవత్సరాలుగా వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భక్తులకు మార్గదర్శకత్వం వహించారు. ఆయన ఆశీస్సులు పొందిన భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచీ కూడా పీఠానికి చేరుకుని సేవలు నిర్వహించేవారు. ఆయన మరణవార్త తెలిసి పీఠం వద్దకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. పీఠాధిపతి భౌతికకాయాన్ని భక్తుల సందర్శనార్థం పీఠంలో ఉంచగా అధిక సంఖ్యలో భక్తులు, ప్రముఖులు తరలివచ్చి గాడ్ భౌతికకాయాన్ని సందర్శిస్తున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.