VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 9:15 pm Posted by : VISWAM VOICE DAILY

శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం: నేరాల నియంత్రణపై జిల్లా పోలీసుల సమీక్ష సమావేశం

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ రాహుల్ మీనా

[td_smart_list_end]

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్:  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో మాసిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఉప విభాగ పోలీసు అధికారులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి నేరాల అదుపు, పెండింగ్ కేసులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సుదీర్ఘంగా సమీక్షించారు.

క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ డేటా ఆధారంగా జిల్లాలో నమోదైన కేసుల ప్రస్తుత స్థితిగతులను ఎస్పీ సమీక్షించారు. ముఖ్యంగా మూడేళ్లకు పైబడి పెండింగ్‌లో ఉన్న గుర్తుతెలియని కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

డ్రోన్ వినియోగం, 112 అత్యవసర సేవలు, ఈ-చలానా వసూళ్లు మరియు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈ-సాక్ష్య, సీఈఐఆర్ రిపోర్ట్ మరియు మెడ్‌లీపీఆర్ అప్లికేషన్ల పనితీరుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాబోయే వారం రోజుల్లో జరగబోయే జాతరలు, పండుగల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కులపరమైన సమస్యలు తలెత్తకుండా సామరస్య కమిటీల ద్వారా శాంతిని నెలకొల్పాలని సూచించారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువ కావాలని అధికారులకు తెలిపారు.

రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని, పెండింగ్‌లో ఉన్న వారెంట్లు మరియు అరెస్టులను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే 11-07-2026న జరగనున్న లోక్ అదాలత్ కోసం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని, ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.

జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఎస్పీ రాహుల్ మీనా కోరారు.