విశ్వం వాయిస్ కు రత్నకిషోర్ లోటు ఎనలేనిది.

కోరుకొండ జూలై (విశ్వం వాయిస్ న్యూస్) విశ్వం వాయిస్ దినపత్రికకు స్వర్గీయ కుడెల్లి రత్నకిషోర్ చేసిన సేవలు ఎనలేనివని విశ్వం వాయిస్ అధినేత ఖండవిల్లి సునీల్ కుమార్ కొనియాడారు. సోమవారం స్వర్గీయ రత్నకిషోర్ పెద్దకార్యం రాజమహేంద్రవరంలోని తన స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వం వాయిస్ అధినేత సునీల్ కుమార్ తో పాటు పలు మండలాల నుండి విశ్వం వాయిస్ పాత్రికేయులు విచ్చేసి, రత్న కిషోర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్, రత్న కిషోర్ చేసిన సేవలను కొనియాడుతూ పత్రికా రంగంలో అందరితో అన్నఅన్న అంటూ ఆప్యాయతగా పలకరించేవాడని, సంస్థ తరఫున ఏ కార్యక్రమం చేపట్టిన తాను ముందే ఉండేవాడని, అటువంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని, కిషోర్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం రత్న కిషోర్ కుటుంబానికి విశ్వం వాయిస్ సంస్థ తరఫున 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వం వాయిస్ అధినేత ఖండవిల్లి సునీల్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్ర, వెంకటేష్, చిట్టిబాబు, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల పాత్రికేయులు తదితరులు విచ్చేశారు.