RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె. గంగవరం మండలంలో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశాలను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.కే. మహబూబ్ బాషా మరియు జిల్లా సమగ్ర శిక్షణ అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ( ఏ.ఎం.ఓ) పి. రాంబాబు సందర్శించారు. జెడ్. పి. హెచ్. ఎస్ దంగేరులో నిర్వహించిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశాన్ని, మధ్యాహ్నం జెడ్. పి.హెచ్.ఎస్ కె. గంగవరంలో నిర్వహించిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి బోధన–అభ్యసన ప్రక్రియకు సంబంధించిన పలు సూచనలు అందించారు.
ప్రయోగాత్మక బోధనకు ప్రాధాన్యత
భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.కే. మహబూబ్ బాషా మాట్లాడుతూ, సైన్స్ను కేవలం చెప్పడం ద్వారా కాకుండా, విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి, చేయించి బోధించినప్పుడే విషయంపై మరింత స్పష్టమైన అవగాహనతో పాటు అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.ప్రతి సైన్స్ ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను బోధించేటప్పుడు సాధ్యమైనంత వరకు ప్రయోగాత్మక విధానాన్ని అనుసరించాలని సూచించారు. విద్యార్థులతో ప్రయోగాలు చేయించడం ద్వారా వారిలో సైన్స్ పట్ల ఆసక్తి, పరిశీలనా దృక్పథం, ప్రశ్నించే స్వభావం, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు.ప్రయోగాత్మక బోధనను సమర్థవంతంగా అమలు చేసే ఉపాధ్యాయుల కృషికి విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు విద్యాశాఖ నుంచి తగిన గుర్తింపు లభించేలా ప్రోత్సహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు నిర్వహించిన కొన్ని ప్రయోగాలను జిల్లా విద్యాశాఖాధికారి స్వయంగా పరిశీలించి, ఉపాధ్యాయులతో కలిసి ప్రయోగాల్లో పాల్గొన్నారు. ప్రయోగాత్మక బోధన ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని ఎలా రేకెత్తించవచ్చో ఉపాధ్యాయులతో చర్చించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సైన్స్కు సంబంధించిన ప్రయోగాలు, ప్రాక్టికల్ కార్యకలాపాలు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా సైన్స్ అధికారి జి.వి. ఎస్ సుబ్రహ్మణ్యాన్ని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు. ప్రతి పాఠశాలలో అందుబాటులో ఉన్న సైన్స్ ల్యాబ్లు, పరికరాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు అనుభవాత్మక అభ్యసన అవకాశాలు కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం డివైఇవో పి. రామలక్ష్మణమూర్తి, జిల్లా సైన్స్ అధికారి జి. వి.ఎస్ సుబ్రహ్మణ్యం, ఎంఈఓ చోడిశెట్టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.