VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 5:06 pm Posted by : VISWAM VOICE DAILY

ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత.. క్షేమంగా ఉన్నారన్న కుటుంబ సభ్యులు

హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స.. నిలకడగా ఆరోగ్య పరిస్థితి

* వెంటిలేటర్‌పై ఉన్నారనేవి అవాస్తవాలు.. పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి

హైదరాబాద్ (విశ్వం వాయిస్ న్యూస్  బ్యూరో): మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది. గత రెండు రోజులుగా ఆయనకు డయాలసిస్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ముద్రగడ గారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా (Stable) ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

పుకార్లను నమ్మొద్దు: కుటుంబ సభ్యులు

ముద్రగడ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన యశోద హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై ఉన్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. అవన్నీ కేవలం పుకార్లేనని, వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ఆయన వేగంగా కోలుకుంటున్నారని, చికిత్స అనంతరం వైద్యులు ఆయనకు కనీసం 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అభిమానులు, కార్యకర్తలు ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని విజ్ఞప్తి చేశారు.

ఆరోగ్యంపై ఆరా తీసిన వైఎస్ జగన్

ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ముద్రగడ గారి ఆరోగ్య పరిస్థితిని, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే పలువురు రాజకీయ, కాపు సామాజికవర్గ ప్రముఖులు ముద్రగడ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అనారోగ్య కారణాల దృష్ట్యా రాబోయే కొన్ని రోజుల పాటు ఆయన ఎలాంటి రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు హాజరుకావడం లేదని సమాచారం.