GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):
మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఆదివారం ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎస్సై బి. నాగమణి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వి.ఎన్.వి. పవన్కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రంపచోడవరం పరిసరాల్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురిని గుర్తించి వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని, వారిని కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాల మేరకు జరిమానా, జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి వాహనదారులతో పాటు అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకుండా, రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.