విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ :
పోడుసాగుదారులను బెదిరింపులకు గురి చేస్తూ వారి వద్ద నుండి చేస్తున్న అక్రమ వసూళ్లు వెంటనే ఆపేయాలని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ అన్నారు. ఎర్రబోరులో శనివారం ఇర్పా అజయ్ కుమార్ అధ్యక్షతన పార్టీ మండల కార్యదర్శి వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బొప్పెన కిరణ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పోడుభూములలో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై అటవీశాఖ అధికారులు , సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతూ, డబ్బులు ఇస్తే తప్ప పోడుభూముల్లో వ్యవసాయం చేయనీయమంటూ హెచ్చరిస్తూ అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని అన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అని , ఈ విషయంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాగా కొందరికి మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటూ మిగతా పోడుసాగుదారులపై అటవీశాఖ అధికారులతో దాడులకు ఈ ప్రభుత్వం తెగబడిందని అన్నారు. హక్కు పత్రాలు ఉన్న వారి వద్ద నుండి అక్రమ వసూళ్ళ కు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడుతున్న వారిని పోడు రైతులు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక పోరాటాలు, నిరసనలు, అందోళనతో గిరిజనులకు భూమి దక్కిందని , ఎంతో మందిపై కేసులు పెట్టి, నిర్బంధాలు విధించారని, ఆ ఫలితంగా నేడు మనం వ్యవసాయం చేసుకుంటున్నామని గుర్తు చేశారు. ఎటపాక మండలంలోని సాగు పోడుకేంద్రాలలో రైతులను కదిలించి సీపీఎం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు డేగల మాధవరావు, ఆకిశెట్టి రాము, ఐ పద్మ , పులుసు బాలకృష్ణ పాల్గొన్నారు.