విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటి:
రాజమహేంద్రవరం,( విశ్వం వాయిస్ న్యూస్):
గణేష్ ఉత్సవ కమిటీలకు తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు తెలియ జేయునది ఏమనగా ది 31 నుండి జరిగే వినాయకచవితి ఉత్సవాలను సక్రమంగా నిర్వహించుటకు నిర్వాహకులకు ఈ క్రింది సూచనలను తూచ తప్పకుండా పాటించాలని జిల్లా ఎస్పీ వారు తెలియజేశారు.
వినాయకచవితి సందర్భముగా మండపాలు ఏర్పాటు చేయదలచిన నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత సబ్ డివిజనల్ ఆఫీస్,పోలీస్ స్టేషన్,సచివాలయంలో అనుమతులు తీసుకోవాలి.సబ్ డివిజనల్ ఆఫీసు నందు అనుమతులకు దరఖాస్తు పెట్టేముందు దరఖాస్తు తో పాటుగా మున్సిపాలిటీ లేదా పంచాయితి, ఫైర్ డిపార్టుమెంటు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ల అనుమతులు జత చేయాలి.బలవంతపు చందాలు, వసూళ్ళు గాని మరియు దర్శనాల టికెట్ల గానీ పెట్టరాదు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే వాటిపై ఫిర్యాదులు చేయుటకు డయల్ 100 కి ఫోన్ చేయగలరు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులు ఉపయోగించిన విగ్రహాలను పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఉపయోగించ రాదని మరియు మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఉపయోగించవలెనని సూచన చేయడమైనది.
విగ్రహం యొక్క సైజు మరియు బరువు, ఉత్సవం ఎన్ని రోజులు నిర్వహిస్తారు, నిమజ్జనం చేయు తేదీ, సమయం, పోలీసులకు ముందుగా తెలియపరచాలి.దీపారాధన సమయం నందు మరియు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైన ఫైర్ సదుపాయాలు అందుబాటులో ఉంచుకోవాలి.శబ్ద కాలుష్యం పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి నియమాలైన పగటిపూట 55 డేసిబుల్స్, రాత్రి పూట 45 డేసిబుల్స్ ధాట రాదు, బాక్స్ టైపు స్పీకర్లు ను మాత్రమే వినియోగించాలి, ఉదయం 06: 00 నుండి రాత్రి 10:00 గంటల వరకు మాత్రమే స్పీకర్లు ను వినియోగించాలి, పై నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా తగుచర్యలు తీసుకోబడును.కమిటీ సభ్యులు రాత్రి సమయంలో మండపం వద్ద కాపలాగా ఉండాలి, నిర్వాహకులు సి సి టి వి కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
మండపాలు ఉండే ప్రదేశం వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు విగ్రహాల దగ్గర వాహనాలు పార్కింగ్ చేయరాదు.
ఊరేగింపు సమయములో అశ్లీల పాటలు, డాన్సులు చేసినయెడల మరియు విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో గులాల్ లు/రంగులు చల్లడం, లౌడ్స్పీకర్లు ఉపయోగించడం, మందుగుండు సామాగ్రిని కాల్చిన ఎడల వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోబడును.
ఊరేగింపు సమయంలో ఇతర కులాలు, మతాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ప్లకార్డులు మరియు బ్యానర్లు ప్రదర్శించడం చేయరాదు. అలాగే ఊరేగింపుతో పాటు వెళ్ళే మతనాయకులు వేరే మతాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వకుండా మత సామరస్యం పాటించాలి.నిమజ్జనం నిర్దేశించిన సమయములో ఊరేగింపు ప్రారంభించి, నిర్ణీత సమయంలో నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే నిమజ్జనము చేయవలెను.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేయడమైనది.అనుమతులు ఉన్న స్థలంలో మండపలు ఏర్పాటు చేయాలి, ఆయా స్థలంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, అదేవిధంగా అనుమతి పొందిన ప్రదేశాల్లో తప్ప వేరే ఇతర ప్రదేశాల్లో నిమజ్జనం చేయరాదు.పండుగ రోజు నుండి జరిగే ఈ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు ప్రమాదాలు జరుగకుండా మరియు ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తగా పైన తెలియజేసిన కొన్ని నియమ నిబంధనలు మరియు భద్రతా చర్యలను ఉత్సవ నిర్వాహకులు పాటించాలని తెలియజేస్తున్నాము.పైన తెలుపబడిన సూచనలు కమిటీ సభ్యులు తూచ తప్పకుండా పాటించి సంతోషంగా ఈ వినాయకచవితి ఉత్సవాలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలు స్పష్టం చేశారు.