విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
ఇచ్చిన అధికారంతో ప్రజల నెత్తినే చెయ్యిపెట్టిన బస్మాసుర పాలన వైయస్ జగన్మోహన్ రెడ్డిదని తెలుగుదేశం పార్టీ టి.డి.పి రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ మండిపడ్డారు. ప్రజాభీష్టం మేరకు పాలన అందించటంలో విఫలమైన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, అతని అనుచర గణం విశాఖపట్నం మహానగరాన్ని దోచుకునేందుకు కుట్ర పన్నుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. సకల వనరులతో సుభిక్షంగా ఉండి విద్యా, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని మీరు ఉద్ధరించేది ఏముందని, పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్టణంలో పాగా వేసేందుకు వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు రాజధాని అమరావతిని అభివృద్ధి చేయలేని జగన్ రెడ్డి ఇంకో రెండు రాజదానులను కడతానంటే చరిత్ర పుస్తకాల్లో చదివిన ఒకప్పటి పిచ్చి తుగ్లక్ పాలనను గుర్తు తెచ్చుకొని ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రాజకీయాలకతీతంగా కేంద్ర రాష్ట్ర పార్టీలన్నీ ఏకమై ఉద్యమిస్తుంటే వణుకు పుట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అన్ని ప్రాంతాలను సమాన అభివృద్ధి చేయాలనే సదుద్దేశం వైఎస్ఆర్ సీపీకి ఉంటే వెనుకబడిన జిల్లాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఆయన సలహా ఇచ్చారు. అభివృద్ధి పేరుతో అరాచకాలను సృష్టించేందుకు వైయస్సార్ సిపి ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ప్రజా ప్రతిఘటన ఉద్యమంలో వై.సి.పి పార్టీ కాలగర్భంలో కలవకతప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మూర్ఖత్వాన్ని వదిలి ప్రజాభిప్రాయం మేరకు అమరావతిని రాజధాని గా కొనసాగించాలని డిమాండ్ చేశారు.