– అరెస్టు చేయకపోతే పోలీసు స్టేషన్ ముట్టడిస్తాం
– ముమ్మిడివరపు చిన సుబ్బారావు మాదిగ అల్టిమేటం
విశ్వంవాయిస్ న్యూస్, రాజానగరం మండలం:
ఈనెల 1 వ తేదీన కానవరంలో పడమట్ల శ్రీనుపై దాడచేసి విచక్షణా రహితంగా కొట్టి హత్యాయత్నం చేసిన దోషులను వెంటనే అరెస్టు చేయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ ( ఎం.ఎస్.పి) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమన్వయకర్త ముమ్మిడివరపు చిన సుబ్బారావు డిమాండ్ చేశారు.దాడిలో కాలువిరిగి చికిత్స అనంతరం దివాన్ చెరువు లోని ఇంటివద్ద ఉన్న శ్రీనును మంగళవారం చిన సుబ్బారావు,ఎం.ఎస్.పి రాజమహేంద్రవరం కన్వీనర్ కొత్తపల్లి రఘు,ఎం.ఎస్.పి.జిల్లా కార్యదర్శి కొడమంచిలి వెంకట్రావు,ఎం.ఆర్.పి.ఎస్. జిల్లా అధికార ప్రతినిధి కొత్తపల్లి గాంధి,రాయి చిట్టిబాబు,పాలపర్తి ఏసు బాబు, తదితరులు పరామర్శించారు.ఈ సందర్భంగా చిన సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ హత్యాయత్నం చేసిన వారు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,ఆయన సోదరుడు జక్కంపూడి గణేష్ వారికి అండదండలు అందిస్తున్నారని అందుకే పోలీసులు ఈ రోజు వరకు వారిని అరెస్టు చేయలేదని మండిపడ్డారు.దోషులు దర్జాగా తిరుగుతూ జై జక్కంపూడి అంటూ నినాదాలు చేస్తున్నారని చిన సుబ్బారావు తెలిపారు. అందుకే ఎమ్మెల్యే జక్కంపూడి కాపులకు కాస్తున్నారని విమర్శించారు.డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు దోషుల కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు.గాయాల నిర్థారణ సర్టిఫికెట్ కోసం ఎదురు చూస్తున్నామని, వచ్చాక దోషులను అరెస్టు చెస్తామని మూడు వారాలుగా డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు చెప్పడం సమంజసం కాదన్నారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్,జనసేన నాయకుడు బత్తుల రామకృష్ణ ఈ దాడిని ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు.వెంటనే అరెస్టు చేయకపోతే పోలీసు స్టేషన్ ముట్టడిస్తామని చిన సుబ్బారావు హెచ్చరించారు.కొత్తపల్లి రఘు మాట్లాడుతూ కానీ వారంలో పాలేరు గా పనిచేస్తున్న పడమట్ల శ్రీనుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.డీఎస్పీని మూడు సార్లు కలిసినా దోషులపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.బాధితుడికి న్యాయం చేయకపోతే ఉద్యమం ఉదృతంగా చేపడతామని హెచ్చరించారు.శ్రీను భార్య వెంకట లక్ష్మీ మాట్లాడుతూ దాడి చేసిన వారి నుంచి తన భర్త కు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.కొట్టిన వారు తాము కొట్టలేదని ఫోన్లో బెదిరిస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఆమె వాపోయింది.పరామర్శించిన వారిలో ఎం.ఆర్.పి.ఎస్.నాయకుడు పనసయ్య, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ఖండవల్లి లక్ష్మి,మరియమ్మ తదితరులు ఉన్నారు.