సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి జిల్లాలో బాల్యవివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
విశ్వంవాయిస్ న్యూస్, కాకినాడ:
కాకినాడ, (విశ్వం వాయిస్ న్యూస్)
కాకినాడ జిల్లాలోని గర్భిణీ స్త్రీలు, కిశోర బాలికలు, చిన్నపిల్లల్లో రక్తహీనత లోపాన్ని అధిగమించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సును గురువారం ఉదయం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టరు ఎస్.ఇలక్కియ వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరు అయ్యారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు బలోపేతం, వైద్యశాఖలో ఖాళీల భర్తీ, ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి విద్యార్థుల హాజరు, రక్తహీనత పరీక్షలు, బాల్యవివాహాలు, విద్యాశాఖకు సంబంధించి రెండో దశ మనబడి నాడు – నేడు నిర్మాణ, జీర్ణోద్దరణ పనుల పురోగతి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఉపాధి హామీ పథకం, అమృత్ సరోవర్ పనులు, జగనన్న స్వచ్ఛ సంకల్పం తదితర ఇతర ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై అధికారులతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టరు కృతికా శుక్లా తన క్రింద స్ధాయి అధికారులతో మాట్లాడుతూ నూరు శాతం గర్భిణీ స్త్రీలు, కిశోర బాలికలు, చిన్నారులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించాలని, ఇందుకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. రిస్క్ ఉన్న గర్భిణీ స్త్రీలను ముందుగానే గుర్తించి, తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని కలెక్టరు తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి జిల్లాలో బాల్యవివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించే విధంగా అధికారులు పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టరు కృతికా శుక్లా అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సీపీవో పి.త్రినాథ్, డీఆర్డీఏ పీడీ. శ్రీరమణి, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎం.శాంతిప్రభ, డీపీవో ఆర్.విక్టర్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, కాకినాడ, పెద్దాపురం డివిజన్ల డీఎల్డీవోలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.