భక్తాంజనేయ, చైతన్య, ఎలక్ట్రిషన్ అండ్ ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు
రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:
పని గంటల సంఖ్యను తగ్గించడంలో ఎందరో త్యాగమూర్తుల కష్టం ఉందని ఆ త్యాగానికి ప్రతీకగా మేడే నిలిచిందని భవన నిర్మాణ కార్మిక నాయకులు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా, మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తాంజనేయ, చైతన్య, ఎలక్ట్రిషియన్ & ప్లంబింగ్ యూనియన్ల కు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా ఈ వేడుకలకు గ్రామంలోని తాపీ మేస్త్రీలు, పెయింటింగ్ కార్మికులు, వడ్రంగులు, టైల్స్ వర్కర్లు, యూనియన్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చైతన్య భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు లంక చందర్రావు మాట్లాడుతూ, కార్మికుల పని గంటలు తగ్గించడం ద్వారా కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం కల్పించడం మేడే సాధించిన ముఖ్య ఫలితమని పేర్కొన్నారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలులో పలు ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా జిల్లాల విభజన తర్వాత రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో ఆలస్యం జరుగుతోందని, దీనివల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు తగిన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం చలివేంద్రం ద్వారా మజ్జిగ సరఫరా చేసి మండుటెండలో పాదచారుల దాహార్తి తీర్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు కర్రి తాతారావు, బేరా దుర్గాప్రసాద్, గంటి చంద్రశేఖర్, రామారెడ్డి, తదితర భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.



