ఆయిల్ పామ్ తోటల విస్తరణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో మంగళవారం ఉద్యాన శాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ పామ్ ఆయిల్ కంపెనీ వారి ఆధ్వర్యంలో గ్రామం లోని రైతులకు పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏఎస్ ప్రకాష్ ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పామ్ ఆయిల్ తోటల సాగులో జగ్గంపేట మండలం లోని రైతులు అత్యధిక సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారని, అధిక సంఖ్యలో రైతులు 30 నెలలకే గెలలు కొడుతున్నారని, క్రొత్త విధానాలు అవలంబించడం, సాగులో యాంత్రీకరణ పద్దతులు తీసుకురావటం వలన రైతులు అత్యధిక ఆదాయం పొందుతున్నారని మరియు ఇక్కడి సారవంతమైన నేలలు పామ్ ఆయిల్ పంటకు అత్యంత అనుకూలంగా ఉంటాయి అని చెప్పారు అదేవిధంగా పామ్ ఆయిల్ పంట అందరి రైతులకు అనుకూలమైన పంట అని, మన సంస్థ పరిధిలో అర్ధ ఎకరా రైతు నుండి 100 ఎకరాలు పైబడి సాగు చేస్తున్న రైతులు ఉన్నారని తెలియజేశారు.కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ రాయితీలను గురించి వివరించారు. దేశంలో పామాయిల్ వినియోగంలో పోలిస్తే పండించే పంట 25%కు మించట్లేదని అందువలన పామ్ ఆయిల్ పంట అవసరం దేశానికి ఎక్కువగా ఉందని తెలియజేశారు. దేశంలో పామ్ ఆయిల్ సాగులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుందని, ఈ పంట వల్ల చాలా మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు.హార్టికల్చర్ అధికారి శ్రీమతి ఎ .శ్రీవల్లి గారు మాట్లాడుతూ గండేపల్లి మరియు జగ్గంపేట మండలలో 150 హెక్టార్లలో పామ్ ఆయిల్ మొక్కలు ప్రస్తుత 2025 – 26 సంవత్సరంలో నాటి ఉన్నారని, ప్రభుత్వం1 హెక్టార్లలో మొక్కలు కు 29000 రూపాయలు, ఎరువులు రూపంలో మొదటి నాలుగు సంవత్సరాలకు 21000 రూపాయలు అందచేస్తున్నదని మరియు అంతరపంటల రూపంలో మరియొక 21000 రూపాయలు అందచేస్తోందని చెప్పారు. ఇతర ఉద్యాన పంటలకు ఉన్నటువంటి సబ్సిడీలు కూడా పూర్తిగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకురాలు ఆర్ .సీత , మాజీ ఎంపీటీసీ పెంటకోట సత్యనారాయణ,దేశెట్టి శ్రీనివాసరావు, ఇర్రిపాక మాజీ సర్పంచ్ కొండ్రపు సూర్యారావు , కొండ్రపు సూరిబాబు మరియు ఆయిల్ పంప్ కంపెనీ సిబ్బంది టెక్నికల్ ఆఫీసర్ సిహెచ్ దుర్గాప్రసాద్, జగ్గంపేట క్లస్టర్ ఇంచార్జ్ కె .రామకృష్ణ జీ. మారావు మరియు అధిక సంఖ్యలో పామ్ఆయిల్ రైతులు పాల్గొన్నారు.

