సామాజిక ఉద్యమకారుడు.. పాటంశెట్టి సూర్యచంద్ర
సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్టులో పని చేస్తున్న 53 మంది కార్మికులు, గత 19 నెలలుగా తమకు రావలసిన జీతాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ, గత తొమ్మిది రోజులుగా విధులను బహిష్కరించి, రాజమండ్రి లాలాచెరువు సెంటర్లోని రక్షిత మంచినీటి పథకం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు.అయినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సత్యసాయి పథకం ద్వారా 100 గ్రామాలకు త్రాగునీరు అందుతుండగా, ప్రస్తుతం నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రజలకు త్రాగునీరు అందించటం, ఆ నీటిని సరఫరా చేసే కార్మికులకు జీతాలు ఇవ్వటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. 19 నెలలుగా జీతాలు లేకపోతే ఆ కార్మికుల కుటుంబాలు ఎలా జీవిస్తాయి?” అంటూ సూర్యచంద్ర ప్రశ్నించారు. అలాగే గత 25 నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపులు కూడా నిలిచిపోయినందున, కార్మికులు అనేక ఆరోగ్య సదుపాయాలను కోల్పోయారని పేర్కొన్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, సత్యసాయి త్రాగునీటి పథకానికి నిధులు మంజూరు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని విమర్శించారు.
ప్రతి సారి జీతాల కోసం రోడ్డుపై టెంట్లు వేసి నిరసనలకు దిగాల్సిన పరిస్థితి రాకుండా, శాశ్వత పరిష్కారం కల్పిస్తూ, ప్రతి నెలా సమయానికి జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి, 90 గ్రామాలకు త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, అలాగే జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్లు ఈ సమస్యపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.చివరగా, ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోతే, 100 గ్రామాల ప్రజలతో కలిసి పెద్ద స్థాయిలో ఆందోళనలు, నిరసనలు చేపడతామని, కార్మికులకు అండగా నిలుస్తామని పాటంశెట్టి సూర్యచంద్ర హెచ్చరించారు.