పురపాలక మంత్రి – పి నారాయణ
గత ప్రభుత్వ అవకతవకల వల్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో సంక్షేమాంధ్రప్రదేశ్గా మారుస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డా. పొంగూరు నారాయణ అన్నారు. మంగళవారం జగ్గంపేటలో జరిగిన సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.స్థానిక టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి 10 లక్షల కోట్ల రూపాయల భారాన్ని మోపిందని విమర్శించారు. ప్రస్తుతానికి ప్రజలు చెల్లిస్తున్న పన్నులు అంతా గత ప్రభుత్వం తీసిన అప్పులకు వడ్డీ కట్టడానికే సరిపోతున్నాయి అని వ్యాఖ్యానించారు.అయినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రతి ఒక్క వాగ్దానాన్ని తూచ తప్పకుండా నెరవేర్చుతున్నామని వెల్లడించారు.ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలు వెల్లడిస్తూ
• మొదటి నెలలోనే ప్రతి పాత పెన్షన్దారుడికి ₹7000 చెల్లించామన్నారు.
• వికలాంగుల పెన్షన్ను ₹6000కి,
• కిడ్నీ రోగులకు ₹10,000కి,
• మంచం మీద ఉన్న (బెడ్రిడెన్) పేషెంట్లకు ₹15,000కి పెంచినట్లు తెలిపారు.
• మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు.
• “తల్లి కి వందనం” పథకంలో 67 లక్షల మంది పిల్లల పేరుపై రూ.10 వేల కోట్ల రూపాయలను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
ఇంకా, ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందన పొందుతోందని, ఇది ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్, జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.