సిబ్బందికి చిరు సత్కారం చేసిన పాలకమండలి సభ్యులు
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో శ్రీ గౌతమీ జీవకారుణ్యసంఘం చైర్మన్ పదవికి బర్రే కొండబాబు రాజీనామా చేశారు.ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారు.ఈ సందర్భంగా శుక్రవారం జీవకారుణ్య సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ హయాంలో జీవకారుణ్య సంఘానికి సంతృప్తికరంగా సేవలు అందించామని చెప్పారు. తనతోపాటు పాలకమండలి సభ్యులు దాత కారుణ్యానంద స్వామీజీ ఆశయాలమేరకు జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు,అనాధ బాలలు, రోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేశామన్నారు. ఈవో పల్లంరాజు, సిబ్బంది సహకారంతో ప్రతి ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి వృద్ధులు,ఇతరులకు భోజనం , అల్పాహారంలో మార్పులు చేసి వారందరికీ పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టినట్లు కొండబాబు వివరించారు.సంఘం ఆదాయం పెంచడానికి, భూములు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకున్నామని చెప్పారు.షాపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు లీజు కోసం బహిరంగ వేలం వేయాలని సూచించినట్లు తెలిపారు.జీవకారుణ్య సంఘంలోని వృద్ధులకు ఆరోగ్యం సరిగా లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా స్వయంగా చూశామని,అనాధ బాలలు చదివే పాఠశాలలకు వెళ్ళి వారు ఎలా చదువుతున్నారో తెలుసుకున్నామని బర్రే కొండబాబు చెప్పారు. ఈ పదవులను బాధ్యతగా పుణ్య కార్యంగా భావించిన తమ పాలకమండలి నిస్వార్థంగా సేవలు అందించిందని వివరించారు.అనంతరం ఇంతకాలం తమకు సహకరించిన జీవకారుణ్య సంఘం సిబ్బందిని బర్రే కొండబాబు, పాలకమండలి సభ్యులు సత్కారించారు.తొలుత దాత కారుణ్యానంద స్వామీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు నాగులాపల్లి దేవీ లక్ష్మణరావు,బత్తిన అన్నవరం, రఘునందన్,రాధిక,చిట్టా బత్తుల అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.