విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం విశ్వం వాయిస్ న్యూస్
ఆవేశాలు, ఉద్వేగాలతో హింస చెలరేగే విధంగా ప్రవర్తించక, సంయమనం పాటించాలని రాజమండ్రి సౌత్ జోన్ డిఎస్పి ఎం అంబికా ప్రసాద్ అన్నారు. ఎన్నికల ఓట్లు లెక్కింపు అనంతర పరిణామాలలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్గాల మధ్య విభేదాలు హింసాత్మక ఘటనలు సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసే ఉంటారని, ఈ నేపథ్యంలో రాజమండ్రి సౌత్ జోన్ పరిధిలో ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్, ధవళేశ్వరం పోలీస్ స్టేషన్, కడియం పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రజలను సంయమనం పాటించాలని డిఎస్పి తెలిపారు. వేరే ప్రాంతం వారిని చూసి మన ప్రాంతంలో లేని కొత్త సంస్కృతిని, పోకడలకు పోయి అనవసరంగా వర్గాలను మధ్య చిచ్చు రేగే విధంగా ప్రవర్తించవద్దని, శాంతియుత వాతావరణానికి భంగం కలగనీయవద్దని ఆయన అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయి. చట్టపరిధిలో ఉన్న పరిష్కార మార్గాలను అనుసరించాలని, క్షణకావేశాలకుపోయి హింసా ప్రవృత్తికి పాల్పడవద్దని అన్నారు. చట్ట పరిధిలో అందరూ సమానమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, రౌడీయిజం, దౌర్జన్యం వంటివి ఎవరు చేసినా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంతమైన ఈ ప్రాంతంలో తమ మాటల ద్వారా చర్యల ద్వారా అనవసరమైన అలజడి సృష్టించినట్లయితే అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎప్పటిలాగే అందరూ సహకరించాల్సిందిగా కోరారు.