ఇరువైపుల అధికారిక బోర్డులు ఏర్పాటు చేయండి…
కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్…
మండపేట మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మున్సిపల్ రిక్రియేషన్ క్లబ్ ఉన్న రహదారిలో నిత్యం మందుబాబులతో రద్దీగా ఉంటుందని సాధారణ ప్రజలు వెళ్లేందుకు వీలు లేకుండా ఉందని దీనిపై చర్యలు తీసుకోవాలని 29వ వార్డు కౌన్సిలర్ వైసిపి టౌన్ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన జరిగింది. ఎక్స్ అఫిషియో సభ్యులు గా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మున్సిపల్ రోడ్డు బ్రాందీ షాపుల నిర్వాహకులకు ఇచ్చేశామంటూ రోడ్డుకు ఇటూ అటూ నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు. మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు తెల్లవారుజామున పట్టణంలో పర్యటిస్తారని ఆ సమయంలో బ్రాందీ షాపులు తెరిచి ఉండవని దీంతో అక్కడ ఖాళీ రోడ్డు ఆయనకు కనిపిస్తుందన్నారు. ఉదయం 11 తర్వాత ఆ రోడ్డును పరిశీలించాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఇటీవల మద్యం మత్తులో ఓ యువకుడు ఆ బ్రాందీ షాపులు సమీపంలోనే డ్రైన్ లో పడి మృతి చెందిన విషయం గుర్తు చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఆ రహదారిపై ఏర్పాటు చేసిన బడ్డీలను తొలగించడం లేదని దీనికి కారణం ఏమిటో చెప్పాలని నిలదీశారు. వాహనాలు కాదు కదా నడిచి వెళ్లే వారికి కూడా దారి లేకుండా మందుబాబుల విరంగం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ రోడ్డులో నడిచి వెళ్లేందుకు వీలు లేనప్పుడు ఇక ఆ రహదారి బ్రాందీ షాపుల నిర్వాహకులకు ధారదత్తం చేయాలని ఎద్దేవా చేశారు.దీనికి కమీషనర్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ఈ సమయంలో టిడిపి కౌన్సిలర్ యారమటి గంగరాజు మాట్లాడుతూ బ్రాందీ షాపుల వల్ల రాజరత్న సెంటర్ రోడ్ లో కూడా ఇదే సమస్య ఉత్పన్నమవుతుందని ఆరోపించారు. నిత్యం ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అక్కడ కూడా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.