మాదకద్రవ్యాల మత్తు నిండు జీవితాన్ని నాశనం చేస్తుంది
విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగి దూరంగా ఉండాలి
రాయవరం ఎస్సై డి సురేష్ బాబు
మాదక ద్రవ్యాలు మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలని, ఇవి యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తూ, చదువులో వెనుకబడే లా చేస్తాయని రాయవరం ఎస్సై సురేష్ బాబు విద్యార్థులకు తెలిపారు. రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో గల శ్రీ సర్వారాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమం నిర్వహించి, మాదకద్రవ్యాల పట్ల విద్యార్థులకు రాయవరం ఎస్సై సురేష్ బాబు అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అనేకులు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగి దూరంగా ఉండాలని హెచ్చరించారు, వీటికి అలవాటు పడిన విద్యార్థులు,యువకులు చదువులను వదిలిపెట్టి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారన్నారు, ఒకసారి ఈ మత్తుకు బానిసలైతే ఎంతటి అకృత్యాలు,నేరాలు చేయడానికైనా వెనుకాడరని పలు ఉదాహరణలను విద్యార్థులకు వివరించారు, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు సైతం విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలని తగు సూచనలు తెలిపి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరూ పాటుపడాలని విద్యార్థులకు సూచించారు,అనంతరం సమాజానికి చేటు చేసే మత్తు పదార్థాల జోలికి వెళ్లబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు, ముఖ్యంగా తమ,తమ ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడినా,అమ్ముతున్నట్లు తెలిసినా వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,హెడ్ కానిస్టేబుల్ వీర్రాజు,ఇతర పోలీస్ సిబ్బంది, పాఠశాల అద్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.