– 48 అడుగులకు నీటిమట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.
– మంగళవారం ఉదయానికి 54 అడుగులకు చేరుకుంటుందని అంచనా
విశ్వంవాయిస్ న్యూస్, భద్రాచలం:
గత వారం రోజులుగా గోదావరి పరివాహక ప్రాంతం (క్యాచ్మెంట్ ఏరియా) తో పాటుగా మహారాష్ట్ర , ఛత్తీస్ ఘడ్ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంలకు గోదావరి నీటిమట్టం 48.1 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దుమ్ముగూడెం, చర్ల తదితర మండలాలలోని లోతట్టు ప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం ఐటిడిఏ, సబ్ కలెక్టర్ కార్యాలయాలలో హెల్ప్ డెస్క్ (సహాయ కేంద్రాన్ని) సైతం ఏర్పాటు చేశారు.( ఫోన్ నెంబర్ 7995268352 వరదలకు సంబంధించి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు సహాయ కేంద్రాన్ని సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలియజేశారు. ఇదిలా ఉండగా నేడు భద్రాద్రి పట్టణంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. గోదావరి నీటిమట్టం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వరద ప్రస్తుత పరిస్థితి, ఉధృతి పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు.