రహదారి, డ్రైనేజీ వ్యవస్థ పై కీలక సూచనలు
విద్యావ్యవస్థ పై నమ్మకంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని విజ్ఞప్తి
గ్రామ సభలో సూచించిన ఉండవల్లి రాంబాబు
మండల కేంద్రమైన రాయవరంలో శనివారం రాయవరం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నందు గ్రామపంచాయతీ సెక్రటరీ దాసరి సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ చందమల్ల రామకృష్ణ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించగా, ఈ గ్రామసభ ద్వారా రాయవరంలో ఉన్న ప్రధాన సమస్యలపై పలువురు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు సమస్యలకు పరిష్కారంగా పలు సూచనలు చేశారు. ముఖ్యంగా రాయవరం గ్రామ ప్రధాన రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన వ్యాపార ప్రకటన బోర్డులు వెనుకకు జరిపించి, విద్యార్థులకు , పాదచారులకు ఇబ్బంది కలగకుండా రహదారి పైన నీరు నిలబడే సమస్యపై ఆర్ అండ్ బి అధికారులతో చర్చించి, చర్యలు తీసుకుంటామని, గ్రామ ప్రజలను అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఇళ్ల స్థలాలపై త్వరలోనే స్పష్టత రానందుని తెలిపారు. గ్రామంలో ప్రధానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సమస్య పై తీసుకుంటున్న చర్యలను వివరించారు, విద్యా వ్యవస్థ ప్రభుత్వ పాఠశాలలో మరింత బలపడిందని, ప్రభుత్వ సహకారంతో బోధనాపరంగా, సౌకర్యాల పరంగా, కార్పొరేట్ స్థాయిలో చక్కని ఏర్పాట్లు చేసామని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని సూచించారు, మొదటి విడతలో తల్లికి వందనం అందని అర్హత కలిగిన విద్యార్థులకు జూలై 10 నుండి తల్లుల ఖాతాలో జమ అవుతాయని, దీనికోసం ఎన్.పి.సి.ఐ లింకు చేసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 14 వ వార్డ్ మెంబర్ లంక చందు,జనసేన నాయకులు దేవిశెట్టి కోటేశ్వరరావు,వల్లూరి శ్రీనివాస్, గ్రామ సచివాలయం సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, ఎన్.ఆర్.జి.యస్ కార్మికులు, కూటమి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.