– మరలా సెలెక్షన్స్ ఎప్పుడనేది తెలియజేస్తా మన్న అసోసియేషన్
– హాజరైన 19మండలాల క్రీడాకారులు
– రాజమండ్రిలో క్రీడాకారుల కు ఇండోర్ స్టేడియం ఏర్పాటు చెయ్యాలి..
– బురిడీ త్రిమూర్తులు, మల్లికార్జున్
ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్కేవీటీ డిగ్రీ కాలేజి క్రీడా మైదానంలో జూనియర్స్ కబడ్డీ బాయ్స్, గర్ల్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు.తూర్పు గోదావరి జిల్లా 19 మండలాల నుండి 250 మంది బాలురు,150 మంది బాలికలు కబడ్డీ ఎంపికకు హాజరయ్యారు. ఈసందర్బంగా తూర్పు గోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ బురిడి త్రిమూర్తులు మాట్లాడుతూ క్రికెట్ తర్వాత కబడ్డీ క్రీడకు ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు.ఈమధ్య ప్రో కబడ్డీ లీగ్స్ కూడా చూస్తున్నామని గుర్తు చేసారు.26జిల్లాలు ఏర్పడ్డాక విజయవాడలో అక్టోబరులో నిర్వహించ తలపెట్టిన కబడ్డీ పోటీలకు ఎంపిక చేపట్టామని తెలిపారు. అయితే ఎంపిక ప్రారంభంలోనే భారీ వర్షం కారణంగా ఎంపిక వాయిదా వేసినట్లు,ఎంపిక ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలియచేశారు.
తూర్పుగోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్ మాట్లాడుతూ అండర్ 20 విభాగంలో 400మంది క్రీడాకారులు కబడ్డీ సెలక్షన్స్ కి వచ్చారని తెలిపారు.కాలేజీ ప్రిన్సిపల్ అనుమతితో,కాలేజీ పిడి సహకారంతో కోర్టులు ఏర్పాటు చేశామని,పోటీలు కూడా ప్రారంభించామని, అయితే అనుకోకుండా భారీగా వర్షం రావడంతో వాయిదా వేశామని, అందరితో ఆలోచించి తదుపరి తేదీ ప్రకటిస్తామని ఆయన వివరించారు. టీమ్ కెప్టెన్ మాట్లాడుతూ 51వ స్టేట్ అంతర్ జిల్లాల టోర్నమెంట్ కి అందరినీ ప్రోత్సహించి ఇక్కడకు తీసుకు రావడం, పోటీలకు ఏర్పాట్లు చేయడం బాగుందన్నారు. అయితే వర్షం కారణంగా వాయిదా పడ్డాయని, ఎప్పుడనేది తెలియజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అసోసియేషన్ సభ్యులు, తూర్పు గోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు హాజరయ్యారు.