లాభాల బాటలో కత్తిపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలోని ది కత్తిపూడి కర్షక సేవా ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం గత రెండేళ్లుగా లాభాల్లోనే ఉందని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒకింత సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలకు పాలక వర్గాలుగా త్రీ మెన్ కమిటీలను నియమించింది. దీంతో కత్తిపూడి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడుగా రిటైర్డు ఆర్టీసీ డ్రైవర్ గాబు కృష్ణమూర్తి, సభ్యులు (పర్సన్ ఇంచార్జీలు)గా నియమితులైన శరణం జయబాబు, పట్టెం సత్తిబాబు నియమితులు అయ్యారు. వీరు సంఘం కార్యాలయంలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఎన్.డి.ఏ. కూటమి నాయకుల సమక్షంలో తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. వీరికి ముందుగా ఆహూతులు అందరూ పూలదండలను వేసి, శాలువాలను కప్పి అభినందించారు. అనంతరం సహకార సంఘం అధికారిక దస్త్రాల్లో సంతకాలను చేసారు. పదవీ ప్రమాణాలను చేసారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు కల్పించుకుని ఈ సహకార సంఘం లాభాల్లో ఉందా…? నష్టాల్లో ఉందా అంటూ యధాలాపంగా ప్రశ్నించారు. మంత్రి ప్రశ్నకు సహకార సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి పీలా అచ్యుతరామారావు ప్రతిస్పందిస్తూ రెండేళ్ళుగా లాభాల్లోనే ఉందని బదులిచ్చారు.తెలుగు ప్రజల అభిమాన ఆంధ్రాబ్యాంక్ యూనియన్ బ్యాంక్లో విలీనం అయ్యే నాటికి ఆ బ్యాంకు కత్తిపూడి శాఖకు అనుబంధంగా ఉన్న ఈ కత్తిపూడి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆంధ్రాబ్యాంకుకు రూ. 1 కోటీ 60 లక్షల వరకూ బాకీ ఉంది. సహకార సంఘం సభ్యులుగా ఆంధ్రాబ్యాంక్ నుంచి అప్పు తీసుకున్న రైతులు వారి అప్పులను సకాలంలోనూ, నేటికీ కూడి సంపూర్ణంగా తీర్చక పోవడమే ఈ బాకీకి అసలు కారణం. ఆంధ్రా బ్యాంక్ అప్పులకు వడ్డీలకు వడ్డీల మీద చక్రవడ్డీలను వేసి అప్పును తడిపి మోపెడు చేసి సహకార సంఘం ఆర్ధిక అస్థిరతకు కారణం అవుతోందంటూ ఈ సహకార సంఘం న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. అనంతరం కాలంలో ఈ సంఘం 2016 లో జిల్లా కేంద్ర సహకార సంఘం పరిధిలోకి వచ్చాక గత రెండేళ్లుగా రూ. 1,80,000,00 ల ఏటేటి టర్నోవరుతో కేవలం రూ. 5,000,00, రూ. 3,000,00, రూ. 2,000,000 వంటి స్వల్ప లాభాల్లో మాత్రమే ఉంటోంది. అయితే ఈ అప్పుల నిజాలను దాచిపెట్టి లాభాల్లోనే ఉంటోందని మంత్రి అచ్చెన్నాయుడుకు ముక్తసరి సమాధానం చెప్పి లౌక్యం ప్రదర్శించారు.