ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం – ఆర్డీవో
“మీ కోసం” కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై, అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత సూచించారు. సోమవారం స్థానిక కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదికలో వచ్చిన అర్జీలను ఆర్డీవో రాణి సుస్మిత స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, మొత్తం ఈరోజు 21 అర్జీలు పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించడం జరిగిందని తెలిపారు. వారంలో రెండు రోజులు సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా, డివిజన్ అధికారులతో సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రతి అర్జీని పరిశీలించి దరఖాస్తుదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత సమయంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈరోజు వచ్చిన కొన్ని అర్జీలు:
కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ కుమారదేవం గ్రామం మూడవ వార్డులో వీధి లైట్లు వెలగడం లేదని, వాటిని బాగు చేయాలని అర్జీ సమర్పించారు.
తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామానికి చెందిన కొప్పాక జయహర్ విజయానంద కుమార్ పైడిమెట్ట గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.