రాష్ట్రస్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్ క్రీడా పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక
రాష్ట్రస్థాయి సౌత్ జోన్ క్రీడా పోటీలకు మాదపట్నం జడ్పీ పాఠశాలకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు టి.మురళీకృష్ణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 3న పెద్దాపురం మహారాణి కాలేజీ క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ముగ్గురు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారన్నారు. వీరు అండర్ – 18 విభాగంలో డి. రాజేష్ (1000 మీ) ప్రథమ స్థానం, ఎన్. యుగేష్ (400 మీ) ద్వితీయ స్థానం, అండర్- 14 విభాగంలో ఆర్.పవన్ గణేష్ (జావెలిన్) ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్రస్థాయి సౌత్ జోన్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు బాపట్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థులకు నిరంతరము క్రీడా శిక్షణ ఇచ్చే వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం. గోవిందు తర్ఫీదు ద్వారానే విద్యార్థుల విజయం సాధిస్తున్నారని ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి శివరామకృష్ణ, ఉప మండల విద్యాశాఖ అధికారి పుల్లయ్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.