కిలోమీటర్ల మేర మండుటెండలో విద్యార్థులతో సైకిల్ యాత్ర చేయించిన వైనం
ఆట బొమ్మల్లా మారిన హైస్కూల్ విద్యార్థుల పరిస్థితి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో తమ సంస్థ ప్రచార కార్యక్రమాలు
ప్రమాదకర రహదారులలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
మండలంలో అధ్వాన్నంగా మారిన విద్యాశాఖ
విద్యాశాఖాధికారి ని పట్టించుకోని పాఠశాలలు
తమ సంస్థ ఉనికి చాటుకోవడానికి తమ సొంత పాఠశాల విద్యార్థులను ప్రక్కన పెట్టి, ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్న పరిస్థితి మండల కేంద్రమైన రాయవరంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే రాయవరం మండలం లొల్ల గ్రామానికి చెందిన విశ్వం మానవతా సంస్థ. తమ సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు, అవగాహన చర్యలు చేపడుతున్నామని పలువురికి చూపించుకునే ప్రయత్నం లో ర్యాలీ లు నిర్వహించగా , ఈ ర్యాలీల కు తమ సంస్థ ద్వారా నడుపుతున్న సొంత ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులను కాకుండా, మండల కేంద్రమైన రాయవరంలో గల శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులను విపరీతమైన ఎండలో మహేంద్ర వాడ, పొలమూరు, రామవరం, కుతుకులూరు వంటి పలు గ్రామాలకు ప్రధాన రహదారులు, ఇరుకు రహదారులలో మండుటెండ లోనే సైకిల్ యాత్ర చేయించి, సంస్థ అవసరాలు తీర్చుకుని, ఎవరి దారిన వారిని విడిచిపెట్టిన ఘటన చూస్తే ప్రభుత్వ పాఠశాల పిల్లలంటే, ప్రైవేటు యాజమాన్య మైన మానవతా సంస్థకు ఎంత చిన్న చూపో అర్థమవుతుంది. కనీస మానవత్వం గా విద్యార్థులకు దాహాన్ని సైతం తీర్చకుండానే, వారి పని పూర్తవగానే విద్యార్థులను పట్టించుకోకపోవడం చూస్తే, మానవతా సంస్థ నిర్వహకులది ఎంత దయలేని జాలి మనసో తేటతెల్లమవుతుంది.
పర్మిషన్ ఎవరిచ్చారు..
మండలంలో జరిగిన అమానుష పరిస్థితి పై మండల విద్యాశాఖ అధికారి వై సూర్యనారాయణ ను వివరణ కోరగా ఈ విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని, ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పడం గమనార్హం. కాగా ఈ చర్యలపై ఆయనను నిలదీయగా, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శాంతి సునీత శెలవులో ఉన్నారని, ఇన్చార్జి హెచ్.ఎమ్ సాయన్న కు ఫోన్ చేయగా అతను చెప్పిన వివరాల ప్రకారం మానవతా సంస్థ నిర్వాహకులు హెచ్.ఎం సునీత వద్ద అనుమతి పొందారని, అందుకే పంపామని విద్యాశాఖాధికారి తో చెప్పడం కొసమెరుపు. కాగా ఈ కార్యక్రమానికి కనీసం పాఠశాల ఉపాధ్యాయుల పర్యవేక్షణ కూడా లేకుండా నిత్యం ప్రమాదాలమయమైన రహదారులలో పిల్లలతో కిలో మీటర్ల మేర సైకిల్ యాత్ర చేయడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ, మానవతా తీరు పై మండిపడుతున్నారు. సొంత అభిప్రాయాలతో విద్యార్థుల రక్షణ గాలికి వదిలేయడం మంచి పద్దతి కాదని, విద్యార్థులకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు సమాధానం చెబుతారని ఆవేదన వ్యక్తం చేస్తూ,రాయవరం హైస్కూల్ ఉపాధ్యాయుల తీరుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖాధికారి సూర్యనారాయణ తెలిపారు.