posted on Oct 18, 2024 3:17PM
ఈ ఏడాది ప్రకృతి మనుషులపై పగపట్టినట్లుగా, కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఎండాకాలం రోళ్లు పగిలే ఎండలు, వడగాల్పులతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. వర్షాకాలం భారీ వర్గాలు, వరదలతో ముంచెత్తింది. ఇక ఈ ఏడాది మిగిలింది శీతాకాలం. శీతాకాలం కూడా ఎముకలు కొరికేసే చలితో జనాలు ఇబ్బందులు పడడం ఖాయమని వాతావరణ శాఖ చెబుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ శీతాకాలంలో కోల్డ్ వేవ్ అనివార్యమంటోంది.
ముఖ్యంగా తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోతాయని హెచ్చరిస్తున్నది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ శీతాకాలం కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అక్టోబర్ ,నవంబర్ మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని ఐఎండీ అంచనా వేసింది. అంటే జనం ఈ శీతాకాలంలో ఎముకలు కొరికే చలిని ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. అలాగే పొగమంచు కారణంగా శ్వాస కోస సమస్యలు ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరించింది. చలి నుంచి రక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించింది.