ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకుందాం : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి. రామ్మోహన్ పిలుపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి. రామ్మోహన్ పిలుపునిచ్చారు. కాకినాడలోని ఐడియాల కళాశాలలో ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఉద్వేగపూరిత వాతావరణంలో నిర్వహించారు.
ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ స్వతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం నినాదాలతో కూడిన ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల హక్కుల కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్లీనరీ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన పి. రామ్మోహన్, ప్లీనరీ సమావేశాల ప్రారంభ ఉపన్యాసం చేస్తూ, ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. విద్యాలయాల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యార్థుల గొంతు నొక్కాలని, ప్రశ్నించే తత్వాన్ని అణచివేయాలని చూసే ప్రభుత్వ విధానాలకు ఇది నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇలాంటి నియంతృత్వ వైఖరిని మానుకోకపోతే విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విద్యారంగంపై నిధులను తగ్గించడం, పాఠశాలలను విలీనం చేయడం, మూసివేయడం వంటి చర్యల ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. విద్యార్థుల విద్యాహక్కును కాలరాసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, ఇది భవిష్యత్ తరాల భవిష్యత్తుకు ముప్పు అని ఆయన హెచ్చరించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యను మొత్తం కార్పొరేటీకరణ, కాషాయీకరణ, కేంద్రీకరణ చేయడం కోసం చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. లాభాపేక్ష లేని విద్యను లాభదాయక వ్యాపారంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. విద్యార్థులు ఈ విద్యా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించాలని, ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం, విద్యార్థుల హక్కుల సాధన కోసం ఎస్ఎఫ్ఐ రాబోయే రోజుల్లో సమస్యల పోరాటాలను మరింత ఉధృతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు ,నాయకులు సాహితు వాసు సంజయ్ వరహాలు చిన్ని సంతోష్ జయరాము, సిద్దు మణికంఠ నాని ఆదర్శ రాజేషు, కరుణ్ కుమార్ సత్యం భువనేశ్వరి అక్షిత గీత రాజి యమునా ప్రసన్న, వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు.