విద్యాశాఖాధికారుల తనిఖీల అనంతరం అందనున్న సంక్షేమం
పాఠశాల యాజమాన్య ఖాతాలో రూ.6500, తల్లి ఖాతాలో రూ.6500 జమ
వివరాలు వెల్లడించిన ఎంఈఓ సూర్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం సంక్షేమ పథకంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తింప చేస్తూ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13000 జమ చేయగా, ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యాహక్కు చట్టం 12(1)సి ప్రకారం ఉచితంగా సీటు పొందిన విద్యార్థులకు ఆ డబ్బులు జమ కాలేదు. కాగా ప్రస్తుతం వారికి కూడా “తల్లికి వందనం” సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6500, పాఠశాల యాజమాన్య ఖాతాల్లో రూ.6500 లను జమ చేయడానికి గానూ, సి.ఆర్.పి లాగిన్ ద్వారా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందని, ప్రైవేటు పాఠశాలలకు 2023,2024 సంవత్సరాలకు చెందిన బకాయిలు సైతం చెల్లించనుందని, మండల విద్యాశాఖాధికారి వై.సూర్యనారాయణ తెలిపారు. దీని విషయమై అవినీతి కి తావులేకుండా ప్రైవేట్ పాఠశాలలో 12(1)సి లో సీటు పొంది,పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను తనిఖీ చేసి, వారి ఫోటో, వివరాలు సమర్పించాలని, అనంతరం ఒకటి,రెండు రోజులలో ఖాతాల్లో మొత్తం జమ చేయబడుతుందని, మండల విద్యాశాఖ అధికారి,సూపర్వైజర్ లకు ప్రభుత్వం ద్వారా ఆదేశాలు అందినట్లు రాయవరం ఎం ఈ వో సూర్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపారు. ఇదివరకే ప్రైవేటు పాఠశాలలకు డబ్బులు చెల్లించిన తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం రూ.6500 లను తిరిగి ఇచ్చేయాలని తెలిపారు. ఈ విషయంలో ఏదైనా సమస్యలు తలెత్తితే మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం లో సంప్రదించాలని, వారిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సూర్యనారాయణ తెలిపారు.