విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్: రచయిత కవి హ్యూమన్ రైట్స్ హక్కుల కోసం, దళిత సమస్యలపై నిరంతరం పోరాటం చేసి, హక్కులు రక్షించిన దళిత ఉద్యమనేత బొజ్జా తారకం 9వ వర్ధంతి కార్యక్రమం న్యాయవాది ఇసకపట్ల రాంబాబు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. తారకం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా బీఎస్పీ నగర ఇంచార్జి ప్రముఖ న్యాయవాది ఇసకపట్ల రాంబాబు మాట్లాడుతూ సమస్యల పట్ల ఎప్పుడూ రాజీపడని మనస్తత్వం గల తారకం నాయకత్వంలో పలు ఉద్యమాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. అనుకున్నది సాధించేవరకు విశ్రమించలేదన్నారు. ప్రజాప్రతినిధులనే కాదు, న్యాయస్థానంలో సైతం తన వాదనకు బలంగా కట్టుబడిన నేత తారకం అని నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ కౌన్సిలర్ జార్జి ఆంటోని మాట్లాడుతూ తారకం హైదరాబాద్ లో రెండు మీటింగులు పెడితే వెళ్లానని గుర్తుచేసుకున్నారు. మీటింగులో మాట్లాడే అవకాశం ఇచ్చారని, తనకు పదవి ఇస్తాననిచెబితే వద్దని చెప్పానని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాల్సి ఉందని అన్నారు. యువత దీన్ని కొనసాగించాలన్నారు.నక్కా వెంకట రత్నరాజు,కొనాల లాజరు,కొంకి రమేష్ మాట్లా డుతూ..ఇందిరాగాంధీ విధించిన ఎమెర్జెన్సీలో 14నెలలు వరవరరావు తో కల్సి ఒకే జైలులో ఒకే సెల్ లో బొజ్జా తారకం గడిపారని, ఆవిధంగా ఇందిరా గాంధీని కూడా ఎదిరించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దళిత సమస్యలు ఎక్కడున్నా స్పందించి పోరాటం చేసిన యోధుడని పేర్కొన్నారు. నిద్ర కూడా మానేసి పోరాటాల మీద దృష్టి పెట్టారని అన్నారు. వెంకటాయపాలెం, చుండూరు, కారంచేడు వంటి ఘటనలపై పోరాటం చేసారని పేర్కొన్నారు. భూ పోరాటం కూడా చేసిన తారకం నిరంతరం పోరాటాలతోనే గడిపారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రం అనిల్ కుమార్, సోమాబత్తుల విజయ్ కుమార్, ఆర్ అండ్ బి పి.ఆనంద్, బీఎస్పీ రూరల్ ఇంచార్జి కె.సూరిబాబు, వరప్రసాద్, వీ ఆర్ వో దడాల జగ్గారావు,కన్నాబత్తుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.