విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
ధవళేశ్వరం ఎన్ఎంఇ లూధరన్ చర్చి పరిరక్షణ కమిటీ సభ్యులపై పెట్టిన బైండోవర్ కేసులు ఎత్తివేయడంతో పాటు నిధుల దుర్వినియోగం చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 1వ తేదీ గురువారం నుంచి చర్చి ఎదురుగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్టు పరిరక్షణ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ది రాజమండ్రి ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఎం.ప్రమోద్కుమార్ మాట్లాడుతూ ఎఇఎల్సి మోడరేటర్ పరదేశి బాబు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగానే తమ లూథరన్ సంఘంలో నిధులు దుర్వినియోగం కావడానికి అవకాశం కల్పించిందని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా సినడ్ బిషప్ ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా తహశిల్దార్, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పాస్టర్ సరెళ్ల అనిల్కిరణ్, జక్కల ప్రవీణ్ చర్చి నిధులను, సభ్యులు ఇస్తున్న కానుకను దారిమళ్లిస్తున్నారన్నారు. వారు చెప్పిన లెక్కల ప్రకారం చర్చికి నెలకు 3 లక్షల 50 వేలు ఆదాయం వస్తోందని, దానిలో లక్షా 50 వేలు ఖర్చులు పోగా మిగిలిన రెండు లక్షల చొప్పున ఇప్పటివరకు అనిల్కిరణ్, జక్కల ప్రవీణ్లు సుమారు 84 లక్షల రూపాయలు దుర్వినియోగం చేసినట్టుగా లెక్క తేలిందన్నారు. సినడ్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీలతో పాటు అన్ని వివరాలను జిల్లా కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేసామని, కలెక్టర్ ఆదేశాల మేరకు దానిపై మైనార్టీ వెల్ఫేర్ అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. దీనిపై తాము కోర్టుని ఆశ్రయించామని, ఎఇఎల్సి రాజ్యాంగం ప్రకారం మోడరేటర్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని, తమకు ఉన్న రాజ్యాంగం ప్రకారం అడ్హక్ కమిటీ ట్రెజరర్ నిధులు డ్రా చేయడానికి వీల్లేదని స్పష్టం చేసారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇరు వర్గాలను శాంతింప చేయాల్సి ఉండగా చర్చి పరిరక్షణ కమిటీ సభ్యుల పై అక్రమ కేసులు పెట్టి బైండోవర్ చేస్తున్నారని, పాస్టర్ జి.కిరణ్బాబుని విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. వారు చేసిన అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేసి వెళ్లిపోతానని ట్రెజరర్గా చెలామణి అవుతున్న ప్రవీణ్ సవాల్ చేసారని, మరీ జరిగిన నిధుల దుర్వినియోగంపై ఆయన ఏం సమాధానం చెబుతారని నిలదీసారు. నిరూపిస్తే 10 రెట్లు ఇస్తామని ప్రవీణ్ చెబుతున్నారని, దుర్వినియోగం చేసిన సొమ్ము తిరిగి చెల్లించి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.
తూర్పు గోదావరి జిల్లా సినడ్ బిషప్ జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చి పాస్టర్గా కిరణ్బాబుని నియమిస్తూ తానే ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలియచేయాలని కోరారు. నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుని, తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా లూథరన్ సంఘాల్లో పరదేశి బాబు బాధితులు ఉన్నారని వారంతా తమకు సంఫీుభావం తెలపాలని కోరారు. సమావేశంలో సభ్యులు దేవ ఏసావు, తొర్లపాటి విజయవర్థన్, రవీంద్ర, నేతల డాన్ సైమన్, రవీంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు.