పాఠశాల నుండి కళాశాలకు వచ్చిన జూనియర్లకు ఘన స్వాగతం పలికిన సీనియర్లు
ఫ్రెషర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న డి.ఎస్.పి రఘువీర్, ఎం.ఈ.ఓ సూర్యనారాయణ
పదవ తరగతి విద్యను పూర్తి చేసుకుని పాఠశాల నుండి కళాశాలకు ఉన్నత విద్య నిమిత్తం వచ్చిన విద్యార్థుల మనసుల లోని ఆందోళన, భయాన్ని తొలగించడానికి రాయవరం లోని విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మల్లిడి శేష వేణి ఆద్వర్యంలో విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు స్వాగతం పలుకుతూ కళాశాల ప్రాంగణంలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విజ్ఞాన్ విద్యాసంస్థల గౌరవ అకడమిక్ సలహాదారులు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి మాట్లాడుతూ, విజ్ఞాన్ విద్యాసంస్థలలో మంచి విజయాలు సాధించిన మీ సీనియర్ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని,మనసులోని ఆందోళనలను విడిచిపెట్టి, అంతకుమించి విజయాలు ఫ్రెషర్స్ గా చేరిన విద్యార్థులు సాధించాలని సూచించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్రపురం డి.ఎస్.పి బి.రఘువీర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థి దశ, పాఠశాల నుండి కళాశాలకు చేరి ఒక క్రొత్త అనుభూతిని ఇస్తుందని, ఈ దశలో విద్యార్థి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తన భవిష్యత్తు,జీవితం ముడిపడి ఉంటుందని వివరించారు, ఈ ప్రాయంలో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా తమ విద్యాబుద్ధులు ఉండాలని ఆయన సూచించారు. గత ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ సాధించిన విద్యార్థులను అభినందించి,ప్రోత్సహించారు. అనంతరం రాయవరం మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి. సురేష్ బాబు విద్యార్థులకు సూచనలు చేస్తూ,జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే విద్యార్థులు ఇంటర్మీడియట్ దశలోని యవ్వన ప్రాయంలో మంచి నడవడిక, ఆదర్శవంతమైన ప్రవర్తన కలిగి ఉండాలని విద్యార్థులకు వివరించారు. మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయవరం మండల విద్యాశాఖాధికారి వై సూర్యనారాయణ మాట్లాడుతూ, చదువును కష్టంగా కాకుండా ఇష్టపడి చదవాలని, విద్యలో ఆరోగ్యకరమైన పోటీతత్వం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మల్లిడి శేష వేణి,విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సబ్బెళ్ల అచ్చిరెడ్డి, వి.ఎస్.ఆర్ రూరల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ మల్లిడి సతీష్ రెడ్డి, సి.ఆర్.టి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ తేతలి సుబ్బిరెడ్డి, విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ త్రివేణి,కుతుకులూరు హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు పులగం నాగిరెడ్డి దంపతులు, అధ్యాపక అధ్యాపకేతర బృందం, విద్యార్థినీ,విద్యార్థులు,తదితర సహాయకులు పాల్గొన్నారు.