విద్యాసంస్థల తీరుపై మండల విద్యాశాఖాధికారి కి తల్లిదండ్రుల పిర్యాదు
సమస్యలను పరిష్కరించిన ఎంఈవో సూర్యనారాయణ
విద్యా హక్కు చట్టం 12(1)సి ప్రకారం, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా సంవత్సర ప్రవేశాల లో తమ పూర్తిస్థాయి సీట్లలో 25% ఆర్థికంగా వెనుకబడిన,బలహీన వర్గాల పిల్లలకు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయించి వారికి ఉచిత విద్య నందిస్తూ,వారి నుండి ఎటువంటి రుసుము వసూలు చేయకూడదు. కాగా రాయవరం మండలంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, ముఖ్యంగా అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలు,నిర్వహణ వ్యయాలు పెరిగాయని చెబుతూ, అదనపు ఫీజులను వసూలు చేస్తూ, అధికంగా యాక్టివిటీ ఫీజుల పేరుతో రసీదులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వసూలు చేయడంతో పాటు, ఆ ఫీజులు చెల్లిస్తేనే కానీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వమని తల్లిదండ్రులను వేదింపులకు గురి చేస్తున్నారు, మండలంలోని ఒక పేరు మోసిన పాఠశాలలో అయితే యాజమాన్యం మరో అడుగు ముందుకెళ్లి, ఏ విధము చేతనైనా ఉచిత విద్య విధానం రద్దయితే, స్కూల్ కు ఫీజు మొత్తం చెల్లిస్తామని తల్లిదండ్రులతో పత్రాలు వ్రాయించి,సంతకాలు చేయించుకోవడం చర్చనియాంసంగా మారింది. ఈ సంఘటనలతో మండలంలోని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయానికి లోనై, మండల విద్యాశాఖ అధికారి వై సూర్యనారాయణ కు సదరు విద్యా సంస్థలపై ఫిర్యాదు చేయగా, ఎంఈవో వారి సమస్యలను విని, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు తప్ప అధికంగా వసూలు చేయొద్దని,యాక్టివిటీ ఫీజులు పేరుతో తల్లిదండ్రులకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించొద్దని సూచిస్తూ, విద్యాహక్కు చట్టంపై అసహనం కలిగేలా వ్రాయించుకున్న పత్రాలను తల్లిదండ్రులకు తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించారు, అనంతరం పిర్యాదు చేసిన వారితో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాహక్కు చట్టం12(1)సి ప్రకారం రూ.6500 లు ఫీజుగా నిర్ణయించిందని, ఆ ఫీజును తప్పకుండా చెల్లించాలని, కాగా చెల్లించిన రూ.6500 లు తిరిగి జూలై 10న తల్లుల ఖాతాలో జమ అవుతాయని తల్లిదండ్రులకు వివరించారు. ఈ సమాచారంతో ఏకీభవించిన విద్యార్థుల తల్లిదండ్రులు, సమస్యలను గూర్చి తెలిపిన వెంటనే స్పందించి పరిష్కరించిన ఎంఈఓ సూర్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.