రూ. 5.25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
కాకినాడ జిల్లా గండేపల్లి పోలీసులు ట్రాక్టర్ ట్రక్కులను దొంగిలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ. 5,25,000 విలువైన దొంగిలించిన ట్రక్కులు, నేరానికి ఉపయోగించిన ట్రాక్టర్ ఇంజిన్, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.గత కొద్ది రోజులుగా గండేపల్లి మండలంలోని తాళ్లూరు, మురారి వంటి గ్రామాల్లోని రైతుల పొలాల నుంచి ట్రాక్టర్ ట్రక్కులు వరుసగా చోరీకి గురయ్యాయి. దీంతో ఆందోళన చెందిన రైతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ మరియు గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా, ఈ దొంగతనాలకు ధవలేశ్వరం మండలం రాజోలు గ్రామానికి చెందిన బి. రత్నరాజు (నాని), కడియం మండలం జేగురుపాడుకు చెందిన ఎం. శ్రీను, పి. తరుణ్, ఎం. వినయ్ అనే నలుగురు వ్యక్తులు పాల్పడినట్లు గుర్తించారు. వీరు తమ సొంత ట్రాక్టర్ ఇంజిన్లతో వచ్చి రైతులు పొలాల్లో నిలిపి ఉంచిన ట్రక్కులను దొంగిలించి పరారవుతున్నట్లు సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ వెల్లడించారు.పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు దొంగిలించిన ట్రక్కులు, ట్రాక్టర్ ఇంజిన్, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ రూ. 5,25,000 ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగల ముఠా అరెస్టుతో గండేపల్లి మండలంలోని రైతులు ఊపిరి పీల్చుకున్నారు.