విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:
శంఖవరం, మే 18, (విశ్వం వాయిస్ న్యూస్) ;
జాతీయ తెలుగు దేశం పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ వాణిజ్య విభాగం కార్యనిర్వహణా కార్యదర్శిగా ఈగల దేవుడిని ఆ పార్టీ తాజాగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నియామక పత్రాన్ని దేవుడికి అందించింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం గొంధికొత్తపల్లి పంచాయితీకి పూర్వ సర్పంచ్ గా ఈగల దేవుళ్ళు ప్రజలకు సేవలను అందించారు. ఈగల దేవుళ్ళు తొలి సారిగా గొంధి కొత్తపల్లి పంచాయితీకి 1995 – 1999 కాలంలోనూ, అలాగే 1999 – 2004 కాలంలో రెండో దఫాగానూ మొత్తం పదేళ్ళ కాలం పాటు ఉప సర్పంచిగా సేవలను అందించారు. అనంతరం 2006 సంవత్సరంలో ఆ పంచాయితీకీ జరిగిన ఎన్నికల్లో ప్రజా బలంతో సర్పంచ్ గా ఎన్నికై ఈ దఫా వరుసగా నిరవధికంగా ఏడేళ్ళ పాటు సర్పంచ్ గ సేవలను అందించి పంచాయితీ ప్రజల మన్ననలను అందుకుని ప్రజాభిమానాన్ని సంపాదించు కున్నారు. అనంతర కాలం నుంచి పార్టీలో గ్రామ సీనియర్ నేతగా పార్టీ అడుగు జాడల్లో క్రియా శీలకంగా సేవలను అందిస్తూ వస్తున్నారు. తన కాలమంతా మంచి మనిషిగా, పంచాయితీ పదవీ కాలంలో మచ్చలేని ప్రజాప్రతినిధిగా ఈయన పేరు సంపాదించు కున్నారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు కావడంతో ఈయన సేవలను ప్రత్తిపాడు నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ సమన్వయకర్త / ఇంఛార్జి వరుపుల రాజా గుర్తించి ఈగల దేవుడుకు రాష్ట్ర స్థాయి పదవిని ఇవ్వాల్సిందిగా కోరుతూ రాష్ట్ర పార్టీకి సిఫారసు చేసారు. ఈ నేపధ్యంలో చేసిన సేవలు ఊరికే పోవు … మంచి వారికి ఎప్పుడైనా మంచే జరుగు తుందన్న జనవాక్కు నిజమైనట్టు ఈగల దేవుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ వాణిజ్య విభాగం కార్యనిర్వహణా కార్యదర్శి పదవి వరించింది. దీంతో ఓ పంచాయితీ స్థాయి నేతగా ఉన్న దేవుడు ఒక్క సారిగా రాష్ట్ర స్థాయి పార్టీ నేతగా ఎదిగారు. ఈ సందర్భంగా ఈగల దేవుడిని పర్వత సురేష్, మేకల కృష్ణ, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలూ అభినందించారు. ఈయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను చేపట్టి పార్టీకి, ప్రజలకూ మంచి పేరు తీసుకు రావాలని ఆశీర్వదించారు.