* ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్న వైనం
* పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
రాయవరం,విశ్వంవాయిస్ న్యూస్ : రాయవరం ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణంలో ఇటీవల కూలిపోయిన భారీ వృక్షం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. ప్రభుత్వ పాఠశాల పరిధిలో ఉన్న వృక్షం ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాల్సి ఉండగా, దానిని ఎలాంటి అధికారిక ప్రక్రియ లేకుండా బయట వ్యక్తులు యంత్రాలతో ముక్కలుగా నరికి తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెట్టు తొలగింపుపై పాఠశాల యాజమాన్యం, విద్యాశాఖ లేదా గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడం మరిన్ని సందేహాలకు కారణమవుతోంది. సాధారణంగా ఇటువంటి చెట్లు కూలినప్పుడు పంచనామా నిర్వహించి, విలువ అంచనా వేసి, అధికారిక వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అలాంటి విధానాలు పాటించారా? లేక ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయం ప్ స్థానికులు మాట్లాడుతూ, “పాఠశాల ఆవరణలోని చెట్టు అయితే అది ప్రజల ఆస్తి. మరి ఎవరి అనుమతితో తీసుకెళ్తున్నారు?” అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారి స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

