నీటి పారుదలకు ఇబ్బందులు పడుతున్న రైతులు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని పిల్లంక గ్రాంట్ నుంచి జల వనరుల శాఖ కార్యాలయం నుంచి కోరింగ వరకు ఉన్న పంట కాలువ గట్లు పంట కాలువలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కాలువకు ఇరువైపులా 30 అడుగులు ఉండవలసిన గట్లు ఇప్పుడు పది నుంచి 15 అడుగుల వెడల్పుకు మాత్రమే పరిమితమయ్యాయి. దీనికి కారణం స్థానికంగా ఉన్న రైతులు ఆక్రమించుకోవడం. అలాగే పోలేకుర్రు పంచాయతీ తోటపేట నుండి తాళ్ళరేవు వెళ్లే కాలవ గట్టు కూడా ఆక్రమణకు గురవుతుంది, తోటపేట నుంచి తాళ్లరేవు వెళ్లే కాలువ గట్టుపై కొందరు పాకలు కూడా వేశారు. ఇలా కాలువగట్లకు ఇరువైపులా పాకలు వేయడం, పశువులను కట్టడం వల్ల కాలువ గట్ల వెడల్పు తగ్గి కాలువలు పూడ్చుకుపోయి రైతులకు సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రైతులకు సాగునీరు అందడం కష్టంగా మారింది. రైతులు అక్రమణలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.