విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ,విశ్వం వాయిస్ సిటీ న్యూస్ : రంజాన్ పండగ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని.. ముస్లింలు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. మసీదులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం కాకినాడ మెయిన్రోడ్లోని డీ కన్వెన్షన్ హాల్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు, కాకినాడ అర్బన్ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, కాకినాడ మేయర్ సుంకర శివ ప్రసన్న, కుడా ఛైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనారిటీలు ముఖ్యంగా ముస్లింల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలు చేసే ఉపవాస దీక్షలు చాలా గొప్పవని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తున్నట్లు వెల్లడించారు.
గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు నాడు-నేడు పథకం ద్వారా మదరసాలను ఆధునికీకరించినట్లు తెలిపారు. రెండో దశలోనూ అదనపు తరగతి గదులు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. మైనారిటీ కార్పొరేషన్ నుంచి ముస్లిం యువతకు స్వయం ఉపాధి కల్పనకు పౌర సరఫరాల ఎండీయూ వాహనాలను మంజూరు చేసినట్లు తెలిపారు. మైనారిటీలు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. రంజాన్ మాసం సందర్భంగా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు.. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
– కాకినాడ అర్బన్ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ముస్లింల సంక్షేమం కోసం తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ కృషిచేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎం.సునీల్ కుమార్, వక్ఫ్బోర్డు డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, ముస్లిం మత పెద్దలు, కార్పొరేటర్లు, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.