విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ ,విశ్వం వాయిస్:
టిడ్కో లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని స్థానిక నగరపాలక సంస్థ కమిషనర్ కే.రమేష్ బ్యాంకర్ల ను కోరారు. టిడ్కోతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి రుణాల మంజూరుపై శుక్రవారం తన చాంబర్లో కమిషనర్ రమేష్ బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం కాకినాడలో 2056 టిడ్కో గృహాలు మంజూరు కాగా సుమారు 1300 మందికి ఇప్పటికే రుణాలు మంజూరు అయ్యాయన్నారు. మిగిలిన 756 మంది లబ్ధిదారులకు 3.65 లక్షల చొప్పున రుణాలు మంజూరు కావాల్సి ఉందని ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా బ్యాంకర్లు సహకరించాలని కమిషనర్ కోరారు. పీఎం స్వనిధి పథకంలో రూ పది వేలు రుణం తీసుకుని సక్రమంగా చెల్లించిన వారికి రూ 20 వేల చొప్పున రెండో విడత రుణాలు ఇవ్వాలని కమిషనర్ కోరారు. అలాగే కొమరగిరి లేఅవుట్ లో గృహ నిర్మాణ లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రూ 35 వేలు రుణాలు ఇచ్చేందుకు సహకరించాలని ఆయన బ్యాంకర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, మెప్మా పిడి ప్రియంవద, సిటీ మిషన్ మేనేజర్లు సయ్యద్ హుస్సేన్, పద్మావతి, బ్యాంకుల ప్రతినిధులు, బ్యాంకు లింకేజీ కమిటీ సభ్యులు, సి.ఓలు హాజరయ్యారు.