విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
వ్యక్తిగత అభివృద్ధికి మాతృభాషతో పాటు ఆంగ్ల భాష పై కూడా పట్టు సాధించడం చాలా ముఖ్యమని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. శనివారం సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ఆంగ్లభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విశ్వవిఖ్యాత ఆంగ్ల నాటక కర్త ,కవి షేక్స్పియర్ జయంతిని ఆంగ్ల భాషా దినోత్సవం గా జరుపుతారని అన్నారు. భాషతో ముడిపడి ఉన్న చరిత్ర, సంస్కృతి, విజయాల గురించి అవగాహన కల్పించడం ఆంగ్ల భాషా దినోత్సవ ఉద్దేశ్యం అని అన్నారు. ఈనాడు యువత పెద్ద సంఖ్యలో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం ఆంగ్ల భాష అన్నారు. అయితే తల్లివంటి మాతృభాషను మరువరాదని అన్నారు. ఇప్పటి విద్యార్థులలో పలువురికి మాతృభాష అయిన తెలుగులో చదవడం, రాయడం రాదని ఇది చాలా బాధాకరం అని డాక్టర్ శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.