సంప్రదాయ వృత్తులను పరిరక్షిస్తూ గీత కార్మికుల జీవనోపాధికి కృషి
ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించేందుకు చర్యలు
రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు
విజయనగరం, విశ్వం వాయిస్ న్యూస్:
గీత కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రత కోసం కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా పైడిమాంబ యాత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక యూత్ హాస్టల్లో నిర్వహించిన గీత కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో గీత కార్మికులు, సంఘ ప్రతినిధులు పాల్గొని తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
సత్తిబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. ప్రమాదకర పరిస్థితుల్లో పని చేసే గీత కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిర్వహించిన యువగళం పాదయాత్రలో గీత కార్మికుల సమస్యలను తమ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పరిష్కారానికి చర్యలు ప్రారంభించారని పేర్కొన్నారు.
చెట్లెక్కే సమయంలో ప్రమాదవశాత్తు కిందపడే ఘటనలు తరచూ జరుగుతున్నాయని, అలాంటి సందర్భాల్లో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సత్తిబాబు అన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల్లో గాయపడిన వారికి, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గీత కార్మికుల కోసం బీమా, ఆరోగ్య సహాయం, సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు.
గీత కార్మికుల పిల్లలకు మెరుగైన విద్యా అవకాశాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సంప్రదాయ వృత్తులను పరిరక్షిస్తూ గీత కార్మికుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ సమావేశంలో సిమ్మ అప్పారావు, కొలుసు శ్రీనివాసరావు, జే అప్పారావు, సిహెచ్ అప్పన్న,జి. ఎర్ని దేవుడు తదితరులు పాల్గొన్నారు.

