GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో బోనాల జాతరను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేగుళ్ళమ్మ ఆలయం నుంచి సుమారు 100 మంది మహిళలు ఉపవాస దీక్షతో బోనాలు ఎత్తుకుని కిలోమీటర్ మేర కాలినడకన వెళ్లి పొలాల్లో వేంచేసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. గరగల నృత్యాలు, మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల మధ్య సారె, వడి, తోబొట్టు, లాంఛనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. గ్రామస్తులతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భారీగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

