కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK):
పోలీసు కవాతు మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో ఎస్. మల్లిబాబు
ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆగస్టు 15న నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి కాకినాడ పోలీసు కవాతు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను కాకినాడ ఆర్డీవో ఎస్. మల్లిబాబు గురువారం పరిశీలించారు.
వేడుకల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తదితరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వేడుకలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలను సమృద్ధిగా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోపాలకు తావులేకుండా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి మరోసారి పరిశీలించాలని సూచించారు.
ఈ పరిశీలనలో కాకినాడ అర్బన్ తహసీల్దార్ వజ్రపు జితేంద్ర, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భవాని రాజు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

