విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
ఆడ శిశువు పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్యలను నివారించడంతో పాటు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టంపై మురికివాడలు ఇతర ప్రాంత ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు స్థానిక రెవెన్యూ డివిజన్ అధికారి బి. వి వెంకటరమణ తెలిపారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో బివి వెంకటరమణ వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పోలీస్, లీగల్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి డివిజన్ స్థాయి పీసీపీఎన్డీటీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఆల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్ట రీత్యా నేరమని, డివిజన్ స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
కాకినాడ డివిజన్ స్థాయిలో గుర్తింపు పొందిన 92 స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. పిండ, లింగ నిర్ధారణ చట్టంపై మురికివాడలు ఇతర ప్రాంతాల ప్రజలకు వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుంటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్డీవో తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశంలో వచ్చే సమావేశానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి సీడీపీఓలు కూడా హాజరయ్యే విధంగా చూడలన్నారు. ప్రతి స్కానింగ్ సెంటర్లోనూ పీసీ, పీఎన్డీటీ చట్టానికి సంబంధించిన బోర్డులను, వాల్ పోస్టర్లను, ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆర్డీవో
తెలిపారు.
ఈ సమావేశంలో డీఐవో డాక్టర్ కె.అంజిబాబు, గైనికాలజిస్ట్ డాక్టర్ బిబిమోమిని, డాక్టర్ కె.ఎం.నాయాకర్, ఎన్జీవో ప్రతినిధి కె.సింహాద్రి, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.