విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:
శంఖవరం, మే 7, (విశ్వం వాయిస్ న్యూస్) ;
ఎల్ఎల్ఆర్ డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు వారం రోజులు మాత్రమే గడువు ఉందని మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ బి.శ్రీనివాస్ తెలిపారు. ఈ లోగా తమ డ్రైవింగు పరీక్షలను అభ్యర్ధులు ఫూర్తి చేసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ బి.శ్రీనివాస్ శనివారం తన కార్యాలయం నుంచి ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేసారు. కోటనందూరు, తుని, తొండంగి , రౌతులపూడి, ప్రత్తిపాడు మండలాలకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్సులు, లెర్నింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీదారులు 800 మంది వరకూ ఉన్నారని, వీరంతా రాష్ట్ర రవాణాశాఖ పాత సాఫ్టవేర్ విధానంలో దరఖాస్తు చేసుకున్నారని, ఈ పాత సాఫ్ట్ వేర్ ను వారం రోజుల్లో రద్దు చేస్తారని ఆయన వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఈ వారం రోజుల్లోగా ఆయా దరఖాస్తుదారులు డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్స్ బుక్ చేసుకుని, డ్రైవింగ్ పరీక్షలకు హాజరు కావాలని, లేని పక్షంలో గతంలో వేరే సాఫ్ట్ వేర్ లో దరఖాస్తు చేసిన ప్లాట్స్ రద్దవుతాయని, అలా రద్దు కాకుండా ఉండాలంటే దరఖాస్తుదారులు అందరూ విధిగా కొత్త సాఫ్ట్ వేర్ లో మరలా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని కత్తిపూడి రవాణాశాఖ మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ బి.శ్రీనివాస్ వెల్లడించారు.