ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరేన్స్లో అధికారులతో
సమీక్ష..
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్: అసని తుపాను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఆరు తీరప్రాంత మండలాల్లో పూర్తి అప్రమత్తతతో ఉన్నామని. ప్రతి మండలంలోనూ ప్రత్యేక అధికార బృందాలు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి కాకినాడ కలెక్టరేట్ కోర్టుహాల్ నుంచి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.. డీఆర్వో కె.శ్రీధర్రెడ్డి, రెవెన్యూ, పంచాయతీరాజ్, మత్స్య, వ్యవసాయ, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను కలెక్టర్.. ముఖ్యమంత్రికి వివరించారు. తుపాను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్గా ఉన్నామని.. తాళ్లరేవు మండలంలో ఒక ఎస్డీఆర్ఎఫ్, యు.కొత్తపల్లి మండలంలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది తుపాను నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారన్నారు. జిల్లా, డివిజన్ స్థాయిలో హెల్ప్లైన్ నంబర్లతో కంట్రోల్రూంలను ఏర్పాటు చేశామని, మండలస్థాయి బృందాల వద్ద వైర్లెస్ సెట్లను అందుబాటులో ఉంచామని వివరించారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత పెను గాలుల ప్రభావంతో చెట్లు విరిగిపడే అవకాశమున్నందున.. ముందస్తు జాగ్రత్తగా విపత్తు స్పందన, అగ్ని మాపక, విద్యుత్ శాఖలను అప్రమత్తం చేసి, పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో రబీ వరికి సంబంధించి 60 శాతం కోతలు పూర్తయ్యాయని.. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని ముందు జాగ్రత్తగా యుద్ధప్రాతిపదికన సమీప మిల్లులలోని గోదాములకు తరలించినట్లు వివరించారు. ప్రస్తుతానికి వరి కోతలు జరప వద్దని రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. పీహెచ్సీలు, సీహెచ్సీల్లో జనరేటర్లను అందుబాటులో ఉంచామని.. 108, 104 వాహనాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ఓవర్హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపామని, క్లోరినేషన్ జరుగుతోందని తెలిపారు. నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకు జనరేటర్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
*31 పునరావాస శిబిరాల ఏర్పాటు:*
తీరప్రాంత మండలాల్లో 31 సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. అవసరం మేరకు ఈ శిబిరాలకు ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను సిద్ధఃగా ఉంచినట్లు వెల్లడించారు. నిత్యవసర సరుకులను సిద్ధంగా ఉంచామని.. శిబిరాల నుంచి ఇళ్లకు తిరిగే వెళ్లేటప్పుడు ప్రభుత్వ పరంగా అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని (ఒక్కో వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ. 2 వేలు) అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాకినాడ పోర్టు కార్గో ఆపరేషన్స్ను నిలిపేశామని.. నౌకలను సురక్షితంగా ఉండేలా తగిన ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. ఉప్పాడ బీచ్ రోడ్డులో ట్రాఫిక్ను నిలిపేశామని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ, డీపీవో ఎస్వీ నాగేశ్వర్నాయక్, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.విజయ్కుమార్, సీపీవో పి.త్రినాథ్, ఎస్ఈ పీఆర్ ఎం.శ్రీనివాసరావు, అగ్నిమాపక అధికారి ఎన్.సురేంద్ర ఆనంద్, డీఎంహెచ్వో డా. బి.మీనాక్షి తదితరులు హాజరయ్యారు.